Tuesday 31 March 2015

డార్వి ‘నిజం’పై దాడి
Posted on: Tue 31 Mar 22:28:42.319414 2015

                మీడియా ద్వారా, ఆధునిక సమాచార ప్రసార సాధనాల ద్వారా మూఢనమ్మకాలను, మతఛాందసత్వాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి కదా! వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి?
- ఎం. జగన్మోహనరెడ్డి, వరంగల్‌
                 మీరన్నట్టు మారిన పాలకవర్గాల నైజం ఆధారంగా, ఆ వర్గాల కనుసన్నలలో పరోక్షంగా మత రాజకీయాల్ని ప్రబలం చేయడానికి అన్ని కోణాల్లోంచి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ముఖాముఖి మనుషుల మధ్య సంబంధాలు లేకున్నా గ్రూప్‌ మెయిల్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మిథ్యా ప్రపంచంలో అంతర్జాలంలో పరస్పరం సంభాషించుకొంటున్నారు. పరస్పరం ప్రభావితులవుతున్నారు. ఉదాహరణకు, ఈ మధ్య నాకు కొన్ని ఆహ్వానాలు అందుతున్నాయి. 'ఫలానా సంఘంలో చేరండి!' అని. ఇలాంటి ఆహ్వానాలు వేలాదిమందికి అంది ఉంటాయి. చాలామంది వారి ఉచ్చుల్లో పడి ఉంటారు. ఇది ఆందోళనకరం. వారికి సంస్కారం ఎంత ఉందో మనకు తెలీదుగానీ, అభ్యుదయ భావాలున్న మనకు ఉన్న సంస్కారం రీత్యా వారి పేర్లు చెప్పకుండా, వారు ఆహ్వానించిన సంస్థలు లేదా సంఘాల పేర్లు చెప్పకుండా మా మధ్య ఇ-మెయిల్‌ ద్వారా జరిగిన సంభాషణల్ని టూకీగా చెబుతాను.
తాజా ఇ-మెయిల్‌ సంవాదం:
నాకొక ఆహ్వానం :Third International Conference on ‘Science and Scientists-2015’ (http://scsiscs.org/conference)
తృతీయ అంతర్జాతీయ సదస్సు : అంశం: శాస్త్రము - శాస్త్రజ్ఞులు - 2015
నినాదం : “The scientist is able to explain science but… is science able to explain the scientist?” (''శాస్త్రజ్ఞుడు శాస్త్రమంటే ఏమిటో వివరించగలుగుతున్నాడు. మరి శాస్త్రము శాస్త్రజ్ఞుణ్ని గురించి వివరించగలదా?'')
నా అభిప్రాయం: ఇక్కడ శాస్త్రాన్ని తక్కువ చేసి 'శాస్త్రజ్ఞుడు' అనే వ్యక్తిని లేదా 'ప్రాణి'ని అధికం చేసేందుకే ఈ నినాదం. ఇదే మెయిల్‌లో డార్విన్‌ మీద దాడి ప్రత్యక్షంగా ఉంది. శాస్త్రవేత్తలనబడే కొందరి వ్యాఖ్యానాల్ని, వ్యాఖ్యల్ని (quotations) మాత్రమే తీసుకొని డార్విన్‌ పరిణామ వాదాన్ని తిరస్కరించే విధంగా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని వ్యాఖ్యలు (తెలుగులో అనువదించాను) ఇక్కడ చూడండి.
(1) నీల్స్‌భోర్‌ (Niels Bohr) ను ఉటంకిస్తూ:
''భౌతిక ప్రపంచంలో క్వాంటం సిద్ధాంతంతోనే విశ్వం ప్రారంభమయినట్లు ఋజువు చేసినట్లుగానే జీవ ప్రపంచం కూడా విశ్వంతోపాటే ఏర్పడింది. అలాకాకుండా మరోలా జీవాన్ని వివరించేందుకు ఆధారాలు లేవు. అసలు పరమాణువులు ఎందుకు స్వతహాగా స్థిరంగా ఉన్నాయో చెప్పడం ఎంత కష్టమో, జీవం అనే వాస్తవానికి భౌతిక రసాయినక చర్యలే ప్రాతిపదిక అని చెప్పడానికి అంతే కష్టం (నీల్స్‌భోర్‌,భౌతికశాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి విజేత)''
మరో వ్యాఖ్య ఆల్బెర్ట్‌ గ్యోర్గిని ఉటంకిస్తూ:
''అందరి జీవశాస్త్రవేత్తల్లానే నేనూ జీవాన్ని, జీవవ్యవస్థను

అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాను. అతిక్లిష్టమైన స్థాయి నుంచి అంచెలంచెలుగా లోలోపలికి వెళ్లి పరికించాను. కణజాలాలు, ఆ తర్వాత అణువులు, అణువుల తర్వాత పరమాణువులు, అటు పిమ్మట ఎలక్ట్రాన్లు, జీవి నుంచి ప్రారంభించి, నిర్జీవులయిన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను చేరాను. ఎక్కడో నా పరిశీలనలో 'జీవం' మాత్రం కళ్ళు కప్పి పారిపోయింది. మళ్ళీకింది నుంచి పై
స్థాయికి వెళ్లితే 'జీవం' ఆనవాలు దొరుకుతుందేమో ఈ ముసలి ప్రాయంలో నేను పరీక్షించాలి. (ఆల్బెర్ట్‌ జెంట్‌ గ్యోర్గీ, వైద్యరంగపు నోబెల్‌ బహుమతి గ్రహీత).''‘science’   అనే ప్రముఖ పరిశోధనా వ్యాసాల పత్రికను ఉటంకిస్తూ మరో వ్యాఖ్యానం:
''1871లో చార్లెస్‌ డార్విన్‌ ఏమి చెప్పారు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద ఉండే వేడి వేడి నీలి సరస్సుల్లో జీవ రసాయనాలు ఉండేవనీ, అవే క్రమేపీ జీవాణువులుగా మారి తొలి జీవుల్ని ఏర్పర్చాయని. ఇది ఒక అద్భుత వర్ణచిత్రం. అందమైన స్వాప్నిక దృశ్యం. కానీ ప్రియమైన డార్విన్‌ మిత్రమా! నూతన ఖగోళ పరిశోధనల ప్రకారం నీవు ఊహించిన జీవజలం అంటూ ఏదీ లేదు. ఏ సముద్రంలోను, ఏ నదీ, సరస్సుల్లోనూ తొలి జీవ రసాయనాల కణద్రవ్యం  (primordial organic liquid in warm little pond) లేదు సుమా!'' (‘Science’ magazine)..
ఇంకా ఏయే వ్యాఖ్యానాలు ఉటంకించారో వాటికి నా వివరణ, సమాధానం ఏమిటో పై వారం తెలుపుతాను.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక. 

Courtesy with PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment