Sunday 29 March 2015

పిఎస్‌ఎల్‌వి విజయ పరంపర
Posted on: Sun 29 Mar 00:47:59.4828 2015
- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌
                 అది శ్రీహరి కోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌.... సమయం సాయంత్రం ఐదు గంటలు.. భానుడి భగభగలు ఇంకా చల్లారలేదు. మరో వైపు అర్ధాకారంలో చంద్రుడు నీలాకాశం తెరపై కనిపిస్తున్నాడు.... ఆకాశం నిర్మలంగా ఉంది... అందరి చూపూ భూమ్యాకాశాలను ఏకంచేసే వైపే ఉంది.... అంతా నిశ్శబ్ధం. నరాలు తెగే ఉత్కంఠ... 59.30 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసింది. చివరి క్షణం ముగిసింది... కచ్చితంగా 5.19 నిమిషాలకు ఒక్కసారిగా పిఎస్‌ఎల్‌వి సి-27 రాకెట్‌ నింగిలోకి ఎగసింది. రెండో వేదిక నుంచి పచ్చని చెట్ల నడుమ నిప్పులు జిమ్ముతూ దూసుకెళ్లింది. 19.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అనుకున్న సమయానికి నిర్ణీత కక్ష్యలోకి చేరింది. 1,400 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డి ఉపగ్రహాన్ని జయప్రదంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇస్రో ఛైర్మన్‌ ఎఎస్‌ కిరణ్‌ కుమార్‌ అందరికీ అభినందనలు తెలిపారు.
                 ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరినట్లయింది. భారతదేశం నేవిగేషన్‌ వ్యవస్థలో మరో మైలురాయి దాటింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో శనివారం సాయంత్రం పిఎస్‌ఎల్‌వి సి-27 ప్రయోగం విజయవంతమైంది. భూమికి 284 కిలోమీటర్లలో దగ్గరగా, 20,650 కిలోమీటర్ల దూరంలో దీర్ఘ వృత్తాకార ఉప భూ బదిలీ కక్ష్యలోని 19.2 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టింది. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వెంటనే రెండు సౌర పలకాలు విచ్చుకున్నాయి. వెంటనే కర్నాటకలోని హసన్‌ కేంద్రానికి అవి అనుసంధానమయ్యాయి. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. నేవిగేషన్‌లో పూర్తిస్థాయిలో సేవలు పొందాలంటే మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. ప్రస్తుత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డితో నాలుగు విజయవంతమయ్యాయి. నింగిలోకి పంపిన ఉపగ్రహానికి రూ. 125 కోట్లు, రాకెట్‌కు రూ. 90 కోట్లు ఖర్చయింది.
ఇస్రో చేపట్టిన పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 29వది. 28 విజయవంతమయ్యాయి. ఒకటి మాత్రమే విఫలమైంది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించారు. ఈ రకంగా ఆరు ఎక్స్‌్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించడంలో ఇది 8వ ప్రయోగం. పిఎస్‌ఎల్‌వి సి-11, చంద్రయాన్‌, పిఎస్‌ఎల్‌వి సి-17, జిశాట్‌-12, పిఎస్‌ఎల్‌వి సి-19, పిఎస్‌ఎల్‌వి స-ి22, పిఎస్‌ఎల్‌వి సి-25, పిఎస్‌ఎల్‌వి సి-24, 26 ప్రయోగాలు స్ట్రాఫాన్‌ మోటార్లతో జరిగాయి. ఇండియన్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టంలో మొత్తం ఏడు ప్రయోగాలు జరగాలి. ఇందుకోసం రూ. 1,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే మూడు ప్రయోగాలను విజయవంతంగా ఇస్రో చేపట్టింది. జూలై 2013, 2014 ఏప్రిల్‌, 2014 అక్టోబరు పిఎస్‌ఎల్‌వి సి-22, సి-24, 26 ద్వారా మూడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌ 1ఎ, 1బి. 1సి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 1డి నాలుగోది. మరో మూడింటిని ప్రయోగించాల్సి ఉంది. అవి విజయవంతమైతే నావిగేషన్‌ సిస్టంలో భారత్‌ సంపూర్ణ విజయం సాధిస్తుంది. భారతదేశానికి 1,500 కిలోమీటర్ల పరిధిలో నేవిగేషన్‌ సిస్టం సేవలందిస్తుంది. ఇప్పటి వరకూ విదేశీ సహకారం తీసుకుంటున్న భారత్‌కు ఇకపై ఆ అవసరం ఉండదు.
భారత్‌లో పటిష్టమైన  ఉపగ్రహ నేవిగేషన్‌ వ్యవస్థ
                 దేశ అవసరాల నిమిత్తం తయారుచేసిన నేవిగేషన్‌ ఉపగ్రహాలు అన్ని శీతోష్టస్థితుల్లోనూ 24 గంటలపాటు సేవలందిస్తాయి. ప్రస్తుత ఉపగ్రహం రెండు రకాల సేవలందిస్తుంది. సామాన్య ప్రజలకు ఎస్‌టిఎస్‌ నిర్దిష్ట స్థానం తెలుపుతుంది. దీని మొత్తం సాఫ్ట్‌వేర్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. నావిగేషన్‌ వ్యవస్థను పటిష్టపరచడానికి కర్నాటకలోని బైలాలులో భూ వ్యవస్థ కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం ఉపగ్రహాలకు మెదడు లాంటిది. వినియోగదారులకు సేవలందించడానికి, వ్యవస్థను సక్రమంగా నడపడానికి బైలాలు, హసన్‌, భోపాల్‌, దేశంలోని పలు రాష్ట్రాల్లో శాటిలైట్‌ నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 మోనటరింగ్‌ కేంద్రాలు, ఒక నెట్‌వర్క్‌, ఒక కాల కేంద్రం, అంతరిక్ష దిక్సూచి కేంద్రం, ఒక ఉపగ్రహ నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉపగ్రహం ఉపయోగాలు
                 ప్రస్తుత ఉపగ్రహం ద్వారా విస్తృత సేవలందుతాయి. భూమి, సముద్రం, ఆకాశ మార్గంలో వెళ్లే వాహనాల స్థితి, స్థానం, దిక్కులు ఎప్పటికప్పుడు అది తెలియజేస్తుంది. భూ మార్గంలో బస్సు, కారు, రైలు, ఇతర రవాణా వాహనాల్లో నేవిగేషన్‌ సిస్టం ఉంటే ఎప్పటికప్పుడు సమాచారం మన చేతుల్లో ఉన్నట్లే! సముద్ర మార్గంలో ఓడల గమనాన్ని పర్యవేక్షించొచ్చు. ఆకాశంలో విమానాల గమనాన్ని తెలుసుకోవచ్చు. ఆపద సమయంలో ఆదుకోవాడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
                 అలాగే వాహనదారునికి దృశ్య, శ్రవణ విధానంలో దిశానిర్దేశం చేస్తుంది. వాహనం ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. భూ గోళం విషయాలను కనుగొంటుంది. ఇస్రో ఛైర్మన్‌ ఎఎస్‌ కిరణ్‌కుమార్‌ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యాన తొలిసారి ప్రయోగం జరుగుతుం డడంతో ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, శాస్త్రవేత్తలు, చంద్రదత్తన్‌, కున్ని కృష్ణన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.
Curtsey with PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment