Tuesday 22 July 2014



ప్రతి మనిషీి శాస్త్రవేత్తే!







అసలు శాస్త్రవేత్తలు లేకుంటే ఏమయుండేది? శాస్త్రవేత్తలు కనుగొనాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా?
- డి.అపర్ణ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌, కాకినాడ
జవాబు: మానవ సమాజం మొత్తం శాస్త్రవేత్తల మయం. శాస్త్రవేత్తలంటే అదో విభిన్నమయిన జీవజాతి కాదు. వారంతా మనుషులే. పుట్టుకతోనే ఎవరూ శాస్త్రవేత్తకాదు. నోబెల్‌ బహుమతి వస్తేనే, భట్నాగర్‌ అవార్డు వరిస్తేనే, నాలుగు పరిశోధనా పత్రాలు సైన్సు జర్నల్‌లో ప్రచురితమయితేనే శాస్త్రవేత్తలు అనుకోవడం అశాస్త్రీయం. చదువురాని పల్లెటూరి రైతు కూడా ఓ శాస్త్రవేత్తే. ఆ మాటకొస్తే మానవులందరూ శాస్త్రవేత్తలే. హేతుబద్ధంగా ఆలోచిస్తూ, పద్ధతి ప్రకారం జీవన కార్యకలాపాలను, సామాజిక జీవనాన్ని నిర్వర్తించే వారందరూ శాస్త్రవేత్తలే. ప్రపంచంలో ఉన్న ప్రజల్లో హెచ్చుమందికి మూఢనమ్మకాలున్నాయి. అంతమాత్రాన వారిని శాస్త్రవేత్తలు కారని అనకూడదు. ఒక నిర్వచనం ప్రకారం శాస్త్రవేత్త అంటే ఏమిటో ఈ విధంగా చెప్పబడింది.
''పదార్థాల అవగాహనతో తన జీవన ప్రక్రియల్లో శ్రమ తగ్గించుకోవడానికి పదార్థాల ధర్మాలకనుగుణంగా ముడిపదార్థాలను ఉపకరించే పదార్థాలుగా మర్చగలమా లేదా మార్చడానికి తగిన జ్ఞానసంపదగల వ్యక్తే శాస్త్రవేత్త''. ఆ విధంగా చూస్తే ముడిపదార్థాలయిన మట్టి, రాళ్లు, ఇసుక, తదితరాల్ని కొలిమిలో వేసే సిమెంటు కర్మాగారంలోని అందరూ శాస్త్రవేత్తలే. బంకమన్నును తెచ్చి కుండలు చేసే కుమ్మరి, భవనాలు నిర్మించే కమ్మరి, మురికి బట్టలి శుభ్రం చేసే చాకలి, చిందరవందరగా ఉన్న తలకట్టును చక్కని క్రాఫుగా మార్చే మంగలి, నారపోగుల్ని నేతవేసి అందమైన చీరలుగా నేసే నేత కార్మికుడు, తాడి, వెదురు, ఈత వంటి ముడిపదార్థాల నుంచి చక్కని చాపలు, బుట్టలు చేసే మేదరి, మట్టి నుంచి పద్ధతి ప్రకారం సేద్యం చేసి పంటలు పండించే రైతన్న, చక్కగా వంటచేసే వంటవాళ్లు, వినసొంపుగా నాదాన్ని వినిపించే సన్నాయి వాయిద్యకారుడు, తోలు నుంచి చెప్పుల్ని చేసే వ్యక్తి ఇలా అందరూ తమ తమ పనుల్ని ఓ నిర్దిష్ట పద్ధతి ప్రకారం, నిర్దిష్ట ప్రయోజనాల కోసం, నిర్దిష్ట ముడిపదార్థాల్ని తన శ్రమశక్తి, మేధోశక్తి ద్వారా నిర్దిష్ట ఉత్పన్న పదార్థాలు (జూతీశీసబష్‌ర) గా మార్చే ప్రతివ్యక్తీ శాస్త్రవేత్తే. అయితే తరగతిగదిలో అందరూ విద్యార్థులే అయినా వారిలో తరతమ భేదాలున్నట్లే పాదార్థిక పరిజ్ఞానం విషయంలో కూడా మనుషుల మధ్య తారతమ్యాలున్నాయి. అందులో అగ్రస్థానంలో ఉన్నవారే మనం పుస్తకాల్లో చదువుకొనే శాస్త్రవేత్తలు. ఫారడే, ఎడిసన్‌, మేరీ క్యూరీ, ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, గెలీలియో, ఫ్లెమింగ్‌, హిగ్స్‌ మొదలైనవారు ఈ కోవకు చెందిన ఘనాపాటి శాస్త్రవేత్తలు.
'శాస్త్రవేత్తలు లేకుంటే ఏమి జరిగియుండేది? అన్న ప్రశ్న ఇపుడు 'ప్రజలే లేకుంటే ఏమి జరుగుండేది?' అన్న ప్రశ్నకు ప్రతిరూపమే.' కానీ ప్రజలే లేని సమాజాన్ని ఊహించలేము కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం 'ఏమి జరిగి ఉండేది కాదని'.
ఇక రెండో ప్రశ్న: 'శాస్త్రవేత్తలు కనుగొన్నవి తెలుసుకానీ కనుగొననివి తెలీవు. ప్రకృతి పరిజ్ఞానం ఇంత అని పుస్తకంలో పేజీల సంఖ్యలాగా ఉండదు. ఎంత తరిచి చూసినా తెలుసుకోవల్సింది ఇంకా ఉంటుంది. తెలుసుకున్న దానిని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. రైట్‌ సోదరులు కనుగొన్న విమానానికి నేటి విమానానికి చాలా తేడా ఉంది. కానీ ఈ పరిణామం ఒక్కరోజులో అయ్యింది కాదు. మార్కొని నిస్తంత్రి విధానపు (షఱతీవశ్రీవరర) సమాచార పంపిణీకి నేటి షఱళ ... తదితర నిస్తంత్రి పద్ధతికి చాలా తేడా ఉంది. ఇది కూడా ఉన్నఫళాన మారింది కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కంప్యూటర్‌కు, నేటి ఆధునిక కంప్యూటర్‌కు తేడా మీకు తెలియంది కాదు. ఇందులో దశాబ్దాల చరిత్ర ఉంది. అలాగని కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లో పరిశోధనలు ఆగాయా? డాల్టన్‌ నాటి పరమాణు భావనకు, నేటి హిగ్స్‌ బోసాన్‌ ఆవిష్కరణకు మధ్య శతాబ్దాల పరిశోధనలు ఉన్నాయి. ఇలా ఎన్నో రంగాల్లో ఎన్నో ఎన్నో అంతుబట్టని రహస్యాలు మిగిలే ఉన్నాయి.
- ప్రొ||ఎ.రామచంద్రయ్య
సంపాదకులు,చెకుముకి, జన విజ్ఞాన వేదిక 

Courtesy with PRAJA SEKTHI DAILY 

Sunday 6 July 2014

ఎల్ నినో ప్రభావం వలన ఈ సంవత్సరం భారతదేశంలో.....ఫోటోలు

గత శంవత్సరం దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ లో కనీ వినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టించాయి. రాష్ట్రం రూపురేఖలనే మార్చేశాయి. రాష్ట్రంలో వచ్చిన వరుస తఫాన్ లు కోస్తాంధ్రలో పంటలను తుడిచిపెట్టాయి. ఇప్పుడు మరో ఉపద్రవం రాబోతోంది.ఈ సంవత్సరం కూడా భారతదేశ వాతావరణం మీద ఎల్ నినో ప్రభావం పడ్నుందని అది భారత్ ను కరువు కోరల్లోకి నెట్టనుందని వాతావరణ శాఖ నిరాశ కలిగించే సమాచారం అందించింది.
మధ్య ఫసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం లేదా చల్లబడడం వల్ల ప్రతీ ఐదేళ్లకోసారి 'ఎల్ నినో', 'లా నినో' మేఘాల్లో కదలికలు వస్తాయి. ఒకసారి ఎల్ నినో మేఘాలు ఎక్కువగా ఏర్పడితే ఇంకోసారి లా నినో మేఘాలు ఎక్కువగా ఏర్పడుతాయి. దీని కారణంగా వాతావరణంలో వేడి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. 'లా నినో' మేఘాలు ఎక్కువగా ఏర్పడితే వరదలు వస్తాయి. ఫలితంగా 'ఎల్ నినో' మేఘాలు ఎక్కువగా ఏర్పడితే కరువు వస్తుంది. ఇది లాటిన్‌ అమెరికా నుంచి ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలను అడ్డుకుని వాటి వేగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వర్షాలు సకాలంలో పడవు. అందువల్ల ఆ ఏడాది వ్యవసాయం దెబ్బతింటుంది. తిండి గింజల ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా ప్రజలు ఆకలితో అల్లాడుతారు.
2004 సంవత్సరంలో భారత దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను వాతావరణంలో ఏర్పడిన ఈ 'ఎల్‌ నినో' ప్రభావమే అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది దేశంలో సాధారణం కంటే 10 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో సాంకేతికంగా 2004ను కరవు సంవత్సరంగా ప్రకటించారు.
అలాగే 2009లో కూడా 'ఎల్ నినో' ప్రభావం కారణంగా వర్షాలు రాక దేశంలో వ్యవసాయం బాగా దెబ్బతింది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కరువు ఈ సంవత్సరంలో ఏర్పడింది.
2014లోనూ 'ఎల్ నినో' తన ప్రభావాన్ని మరోసారి దేశ వ్యవసాయం, ఆర్థిక పరిస్థితిపై చూపనుంది. ఇప్పటికే బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ 'ఎల్‌ నినో' ప్రభావం వస్తే వీటి ధరలు చుక్కల దగ్గరికి చేరుతాయేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో గత 130 ఏళ్లలో వచ్చిన కరువుల్లో 60 శాతం 'ఎల్‌ నినో' సమయంలోనే ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1997 లో ఎల్ నినో ప్రభావం మనదేశ వాతావరణంలో మార్పు తీసుకు వచ్చినా, మన దేశానికి పెద్ద నష్టం జరగలేదని....కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ వ్యయాలు,ధరల కమీషన్ మాజీ అధిపతి అశోక్ గులాటి చెప్పేరు.