Friday 17 January 2014

    ఆరు తరాల శిల్పకళా కుటుంబం



                    అరవై నాలుగు కళల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతిదీ గొప్పదే. కళ కూడా అందరికీ అబ్బదు. కళ పట్ల అభిరుచి ఉండాలి. నేర్చుకోవాలన్న పట్టుదల, నిరంతర కృషి ఎంతో అవసరం. ఏ కళనైనా ఒంటబట్టించుకోవాలంటే సంబంధిత కళ గురించి అధ్యయనం చేయాలి. నిరంతర సాధన చేయాలి. కాలానుగుణంగా మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. ఇవన్నీ తానెంచుకున్న కళలో ఇముడ్చుకొని ముందుకు పోగలిగితేనే కళాకారులుగా రాణింపునకు వస్తారు. కళలో రాణింపునకు వచ్చేవారు చాలామంది ఉండవచ్చు. కానీ ఉన్నత శిఖరాలకు చేరుకునేవారు కొద్దిమందే ఉంటారు. 64 కళల్లో ఒకటైన శిల్పకళకు విశేష ప్రాచుర్యం తీసుకురావడానికి ఆరు తరాలుగా ఆ కుటుంబం చేసిన కృషి నిరుపమానం. సుమారు 250 ఏళ్ల నుంచీ ఈ వృత్తికి అంకితమై ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్న ఆ శిల్ప కళా కుటుంబంలో ఐదు, ఆరోతరం ప్రతినిధులుగా ముందుకొచ్చారు - కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్ర. గుంటూరుజిల్లా, తెనాలికి చెందిన వీరు ప్రయోగాలతో విగ్రహాల రూపకల్పనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాలానుగుణమైన శిల్పకళా రీతులను సమాజానికి పరిచయం చేస్తున్నారు. ఈ రంగంలో విశేష కృషి చేస్తున్న కాటూరి వెంకటేశ్వరరావుతో 'జీవన' మాటామంతీ... 
''మాది ఆరు తరాల వారసత్వం.. మా తాత చంద్రయ్య తన కాలంలో తెనాలిలో మార్వాడీ గోపురం కట్టడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారట! మా తాతకు ముందు ఆయన తండ్రి వెంకటసుబ్బయ్య, ఆయన నాన్న యానాది ఈ శిల్పకళను కొనసాగిస్తూ వచ్చారని చంద్రయ్య తాత చెప్పగా తెలిసింది. మా నాన్న వెంకటేశ్వర రావు ద్వారా నేనీ వృత్తిని నేర్చుకున్నా. నా ద్వారా మా అబ్బాయి రవిచంద్ర కూడా ఈ రంగంలోకి వచ్చాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా మా తరాలలోనూ శిల్పకళ మారుతూ వచ్చింది. మా ముత్తాతలు, తాతలు ప్రధానంగా దేవాలయాలు, గోపురాలు నిర్మించడమేగాక వాటిపై శిల్పాలు మలిచేవారు. ఓసారి ప్రకాశం జిల్లా టంగుటూరులో వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు జీర్ణోద్ధరణకు చేయాల్సి రావడంతో మా తాతగారికి పిలుపొచ్చింది. వాటి మరమ్మతులు తాత గారితో చేయించారు. అప్పుడు తెలిసింది - మాకు అవి మా ముత్తాతలు కట్టిన గోపురాలని. అందు వల్లనే తాతను పిలిపించి వాటిని పునరుద్ధరించారని. 
ఇలా ఈ కళ అనేక తరాల నుంచి మాకు వారస త్వంగా వస్తోంది. తెనాలిలో స్థిరపడిన నాన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 500 దేవాలయాలను నిర్మించారు. నా చదువు తొమ్మిదో తరగతితో ఆగి పోవడంతో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. 
దేవాలయాలపై శిల్పాల తయారీ పనిని మా నాన్నే నేర్పారు. తెనాలిలో కన్యకాపరమేశ్వరి గాలిగోపురం, అష్టలక్ష్మీ దేవాలయం నేనే నిర్మించాను. తెనాలిలోని ప్రసిద్ధ దేవాలయాలు, గాలి గోపురాలు, వాటిపై శిల్పాలన్నీ మా తాత, నాన్న, నేను నిర్మించినవే. ఆ తర్వాత నా దృష్టి కాంస్య విగ్రహాల తయారీ మీద పడింది. కాంస్య విగ్రహాల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అంచ రాధాకృష్ణమూర్తి (బోడపాడు) వద్ద శిక్షణ పొందాను. అక్కణ్ణుంచి కాంస్య విగ్రహాలతోపాటు, పంచలోహ, ఉత్సవ విగ్రహాల్ని తయారుచేయడం ప్రారంభించాను. గత 30 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నా. వేల విగ్రహాలు నా చేతి మీదుగా రూపుదిద్దుకున్నాయి. నే చేసిన ఎన్నో విగ్రహాలు రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రుల చేతుల మీదుగా ఆవిష్కృతమయ్యాయి. విగ్రహాల తయారీ రొటీన్‌ కావడంతో... ఈ రంగంలో ఏదైనా కొత్తదనం ప్రవేశపెట్టాలని నా మనసు ఉవ్విళూరుతుండేది. ఏదైనా వ్యర్థ పదార్థంతో విగ్రహాలు తయారుచేస్తే అన్న ఆలోచనతో ఇనుప తుక్కుతో తయారుచేశా. 
సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్‌లో పర్యావరణ సదస్సు జరుగుతోంది. కాబట్టి పర్యావరణానికి హాని కలిగించే తుక్కుతో సింహం బొమ్మను తయారు చేయడం ప్రారంభించా. దీనికి సుమారు రెండు వేల ఐరన్‌ పనిముట్లు - అంటే సైకిల్‌ చైన్లు, చైన్‌ వీల్స్‌, పెడల్స్‌ (స్క్రాప్‌)తో, దాదాపు ఐదారు వేల వెల్డింగులతో సింహరాజం విగ్ర హం తయారుచేశా. అద్భుతంగా వచ్చింది. గుర్రం కూడా ఇలాగే చేస్తే ఎలా ఉంటుందీ అను కున్నా. దీనికి ఐదు వేల రబ్బరు వాషర్లతో పని మొదలెట్టా. ఈ విగ్రహానికి 20 వేల వెల్డింగులు చేయాల్సి వచ్చింది. దీన్ని తయారు చేయడానికి అనేక నెలల కాలం పట్టింది. తయారీకి ఎంతకాలం పట్టినా వైవిధ్యంగల విగ్రహాల్ని తయారుచేస్తున్నా ననీ.. అవి అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించగలవనే భావనే నన్ను ఆ రంగంలో మరింత లోతుకు తీసికెెళ్లింది. ఒక సింహం, గుర్రమే కాదు. అన్ని రకాల జంతువుల విగ్రహాలూ తయారు చేశా. ఐరన్‌ బాల్స్‌ తోనూ, బోల్టులు, నట్లు, చైన్లు, మెష్‌లు ఇలా అన్నిటినీ ఉపయోగించి విగ్రహాలు చేశా. ఒక్కో బొమ్మకు దాదాపు 200 కిలోల స్క్రాప్‌ పట్టేది. వేల సంఖ్యలో వెల్డింగ్‌లు పెట్టాల్సి వచ్చేది. ఓ టన్ను స్క్రాప్‌ కొంటే అందులో పనికొచ్చేది సగం కూడా ఉండేది కాదు. పనికొచ్చే పార్టులు మాత్రమే తీసుకొని తయారు చేయాల్సి వచ్చేది. అదీ నెలల తరబడి. 
హైదరాబాద్‌ పర్యావరణ సదస్సులో ప్రదర్శనకు పెట్టిన విగ్రహాల్లో సింహం విగ్రహాన్ని ఓల్సన్‌ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో ఈ మార్కెట్లోకి ప్రవేశించడం తేలికే అనిపించింది. బెంగుళూరులో ప్రదర్శన నిర్వహించినప్పుడు రాయల్‌ ఒరాకిల్‌ కంపెనీ వారు ఐరన్‌ స్క్రాప్‌ విగ్రహాలను కొనుగోలు చేశారు. ఆ తరువాత గుంటూరు జిల్లా అమరావతిలో 'కాలచక్ర' జరిగినప్పుడు ప్రదర్శన ఏర్పాటు చేశా అక్కడకు అనేక మంది విదేశీయలు వస్తారని. అక్కడ ఖాట్మండ్‌కు చెందిన పెంగ్విన్‌ బుక్‌షాపు వారు స్క్రాప్‌తో తయారుచేసిన ఓ పాప విగ్రహాన్ని కొనుగోలు చేశారు. మెల్లగా మార్కెటింగ్‌ పెరుగుతుండడంతో దేవాలయాలు, గాలి గోపురాలు, వాటిపై విగ్రహాల తయారీ నిలిపివేశాను. మైనపు విగ్రహాలన్నీ తయారుచేయాలనిపించింది. లండన్‌లోని మేడమ్‌ టుస్సాట్స్‌ మ్యూజియంలో మాదిరి విగ్రహాలవైపు నా దృష్టి మళ్లినా మనది ఉష్ట ప్రాంతం. అలాంటి విగ్రహాలు ఎక్కువ రోజులు నిలవవు. కొన్ని చేసినా అవి స్థానికంగా ఎగ్జిబిషన్‌కే పరిమితం చేశా. వైవిధ్య శిల్పకళలో ఈ 30 ఏళ్లలో ఎందరో సత్కారాలు పొందాను. ప్రస్తుతం మా అబ్బాయీ విగ్రహాల తయారీలో కొత్తపుంతలు తొక్కుతున్నాడు. చివరిగా ఓ మాట చెప్పాలి. ఈ రంగంలోకి దళారులు ప్రవేశించి, కళాకారులుగా చలామణీ అవుతున్నారు. వీరు విగ్రహాల్ని 'డై'లుగా తయారు చేసి పోత పోస్తు న్నారు. దీంతో వాస్తవ కళాకారుడు తీర్చిదిద్దిన బొమ్మ నెలలు పడితే ఈ 'డై'ల మీద కొద్దిరోజుల్లోనే విగ్రహాలు తయారవుతున్నాయి. వీటిని అమ్మి వీరు కోట్లు గడిస్తు న్నారు. ఇది శిల్పకళకు అవమానమని నా భావన. 
భవిష్యత్తు పైనే నా దృష్టి: శిల్పి రవిచంద్ర
వారసత్వంగా నాకూ ఈ కళ అబ్బింది. మా వంశంలో ఎవరూ చదువుకోలేదు. నేను చదువుకొని ఈ రంగంలో మరింత ప్రయోగాలు, పరిశోధనలూ చేయాలనే సంకల్పం పెట్టుకున్నాను. అందుకే నేను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.టి.యు) నుంచి ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, కోల్‌కతాలోని గవర్నమెంట్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాను. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ నుంచి 'బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌' అవార్డు అందుకున్నాను. 2007-9 సంవత్సరాలకు ఉత్తమ విద్యార్థి అవార్డు పొంది, బంగారు పతకం అందుకున్నాను. అలాగే కొల్‌కతా యూని వర్సిటీలో చదివేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌ నుంచి అవార్డుతోపాటు బంగారు పతకం పొందాను. నాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య నుంచీ, బెంగాల్‌లో ప్రముఖ రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ నుంచీ అవార్డులు, పురస్కారాలు పొందాను.
నాన్న పర్యవేక్షణలో శిల్పకళలో మెళకువలు నేర్చుకుంటూ జెఎన్‌టియులో మరింత మెరుగులు దిద్దుకున్నా. ఒక్క శిల్పకళకే ఎందుకు పరిమితమవ్వాలని నేను పెయింటింగ్స్‌ కూడా మొదలెట్టాను. మొదట బుద్ధుని చరిత్రపై ఎనిమిది పెయిం టింగ్స్‌ వేసి, అమరావతిలో జరిగిన 'కాలచక్ర-2006'లో ప్రదర్శించా. తరువాత భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, డాక్టర్‌ కె.ఎల్‌. రావు విగ్రహాలను తయారు చేశా. తీవ్రవాద ఇతివృత్తంగా కొన్ని విగ్రహాలు తయారుచేశాను. ఢిల్లీలో ఇండియన్‌ నేషనల్‌ ఫోరం ఆఫ్‌ ఆర్ట్స్‌ Êకల్చరల్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు దేశం మొత్తంమీద 98 మంది శిల్పకారుల శిల్పాలు ఎంపికయ్యాయి. రాష్ట్రం నుంచి నా శిల్పానికి ప్రదర్శ నార్హత లభించింది. బాపట్లలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో ప్రతిష్ఠించేందుకు ఉద్దేశించి.. మహనీయులు, శాస్త్రవేత్తల శిల్పాలు తయారుచేశాను. వాటిలో కారల్‌ మార్క్స్‌, ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, గెలీలియో, డార్విన్‌, మెండెల్‌ లామార్క్‌, హెపో కెట్‌, కెప్లర్‌, నికోలస్‌ కోపర్నికస్‌ ప్రధానమైనవి. ఈ విగ్రహాలన్నీ ఆవిష్క ృతమయ్యాయి. వాటిని పరిశీలించిన వారంతా ఎంతో మెచ్చుకున్నారు. భవిష్యత్తులో వైవిధ్యభరిత మైన కళాకృతులను నా చేతి మీదుగా ఆవిష్కరించగలనన్న నమ్మకం నాకెంతో ఉంది. 
Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment