Thursday 9 January 2014

విదేశీ విహంగాల విడిది నేలపట్టు


- నేటి నుంచి 'ఫ్లెమింగో ఫెస్టివల్‌'
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పులికాట్‌ సరస్సు మరోసారి విదేశీ విహంగాలకు విడిదిగా మారింది. పక్షుల కిలకిలారావాలతో పులికాట్‌ తీరం అలరిస్తోంది. విదేశీ విహంగాల రాక మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. పగలు పూర్తిగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్‌ తీరంలో ఆహారం తీసుకొని, రాత్రి సమయంలో దొరవారిసత్రం నేలపట్టు వద్ద విశాత్రి తీసుకుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ విహంగాలను వీక్షించేందుకు సరస్సుకు ప్రతి నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. 
నిజానికి, ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల క్రితం పులికాట్‌ సరస్సు, దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు చెరువులను పక్షుల కేంద్రాలుగా ప్రకటించింది. ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా 150 రకాల పక్షులు వచ్చి సరస్సు ఒడ్డున సేద తీరుతుంటాయి. ఈ సీజన్‌లో పక్షులు చేసే పలురకాల విన్యాసాలు, కేరింతలను చూసిన పర్యాటకుల మనస్సు పులకరించి పోతుంటుంది. ఈ పులికాట్‌ సరస్సులో మత్స్య సంపద విరివిగా దొరుకుతుండడంతో విదేశీ విహంగాలు తెల్లవారుజాము నుంచే నదిలో ఆహారం తీసుకుంటూ సాయంత్రం గూటికి వెళ్లే సమయంలో తమ సంతానానికి కొంత ఆహారం తీసుకువెళుతుంటాయి. విహంగాలు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి, తమ సంతానాన్ని పెంపొందించుకుని, తిరిగి మార్చి నెలాఖరులో తమ దేశాలకు పయనమవుతుంటాయి.
దేవతా పక్షులు...ప్రజలే రక్షకులు
పులికాట్‌ సరస్సు, నేలపట్టు చెరువులు మాత్రమే కాకుండా ఇక్కడకు సమీపంలో ఉన్న వెదురుపట్టు, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెటూళ్లలో తిరుగాడుతుండడంతో ఆ ప్రాంతాల ప్రజలు వీటిని 'దేవతా పక్షులు'గా ఆరాధిస్తారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా రక్షించుకుంటారు. ఆ పక్షుల రాక మొదలైతే వర్షాలు వస్తాయనిగ్రామాల్లోని రైతులకు నమ్మకం. అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిని ప్రత్యేకంగా చూస్తారు. ప్రభుత్వం వీటి రక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. సాయంత్రం వరకు తమ పంట పొలాల్లో కాయకష్టం చేసుకునే రైతులు ఈ పక్షులను చూస్తూ, తాము చేసిన కష్టం మరచిపోతారు.
మత్స్యకారులకు నేస్తాలు 
పులికాట్‌ సరస్సులో తెరచాపలతో తిప్పలుపడుతూ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు ఈ పక్షుల విన్యాసాలు చూస్తుంటే ఎంతో హాయిగా ఉంటుందని మత్స్యకార్మికులు చెబుతుంటారు. తమతో పాటు ఆహారపు వేటలో ఉన్న ఈ పక్షులు తమ నేస్తాలని వారంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో ఆహారం కోసం మన ప్రాంతానికి వచ్చి పర్యాటకులను ఆనందింపజేస్తున్న విహంగాలను వీక్షించేందుకు నేలపట్టు, పులికాట్‌ తీరానికి రావాల్సిందే!
ప్రతి జనవరిలో ఫెస్టివల్‌
దేశ విదేశాల నుంచి వస్తున్న విహంగాలను దృష్టిలో పెట్టుకుపని మన రాష్ట్రం ప్రతి ఏటా జనవరిలో వీటి పేరుతో పండుగలను సూళ్లూరుపేటలో నిర్వహిస్తోంది. 2001లో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ 'ఫ్లెమింగో ఫెస్టివల్‌'ను ప్రారంభించారు. కాగా, 2012లో ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని టూరిజం క్యాలెండర్‌లో చేర్చింది. దీంతో ఈ శుక్ర, శనివారాలు రెండు రోజులుపాటు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. 

Courtesy with: PRAJA SEKTHI DIALY

No comments:

Post a Comment