Wednesday 9 January 2013

అచ్చుపోయి ఆన్‌లైన్‌ వచ్చె ...

  • ముద్రణాయుగం ముగిసిందా !
ఏ క్షణానికాక్షణం టీవీలు, ఇంటర్నెట్‌, రేడియోలలో వార్తలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో దినపత్రికల అవసరం ప్రశ్నార్ధకంగా మారుతున్న రోజులివి. అలాంటపుడు వారానికి ఒక రోజు వెలువడుతూ వార్తా విశేషాలు అందించే వారపత్రికలకు భవిష్యత్‌ ఉందని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా?
తెల్లని కాగితంపై నలుపు లేక ఇతర రంగులతోనో ముద్రించి మన ముందుకు తెచ్చే వాటిని ఇప్పటి వరకు మనం పత్రికలు అంటున్నాం. అవి వార, పక్ష, మాస, దిన పత్రికలు ఏవైనా కావచ్చు. రోజులు మారిపోతున్నాయి. విండోస్‌ అంటే ఏ గది కిటికీలు అని ఎవరైనా అంటే పాతకాలపు మనుషుల్లా చూసే రోజులివి. రాబోయే రోజుల్లో ముద్రణా యంత్రం ఉన్నా దానికి పని ఉండదు. కనుక కాగితంతో పనిలేదు, అలాంటపుడు దుకాణంలో కొనుక్కొనేందుకు పత్రికలు ఎక్కడుంటాయి? ఉదయాన్నే తలుపు కొట్టి మనల్ని లేపే పేపర్‌ కుర్రాళ్లూ ఉండరు. అయినా మన చేతిలో ఠంచనుగా పత్రికలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోబోయే ముందు అసలు వాటిని ఏమని పిలవాలి? పత్రికలని అనాలా? మరొక పేరు పెట్టాలా? భాషా పండితులు చెప్పాలి.
ఇంతకీ సందర్భం ఏమంటే అమెరికా నుంచి వెలువడే న్యూస్‌వీక్‌ ప్రపంచంలో అత్యధిక కాపీలు అమ్ముడయ్యే వారపత్రికల్లో ఒకటి. జనవరి ఒకటి నుంచి దాన్ని అచ్చు వేయకుండానే పాఠకులకు అందించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. మీడియాలో పనిచేసే వారికి ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదుగాని సామాన్యులకు ఎలా అనిపించటం సహజం. అందుకే ఈ కథనం.

తాను కనుగొన్న అచ్చు యంత్రాన్ని భవిష్యత్‌ తరాలు మరింతగా మెరుగు పరుస్తాయని జాన్‌ గూటెన్‌బర్గ్‌ ఆశించి ఉంటాడేమోగాని, అసలు యంత్రంతో పనిలేకుండా పత్రికలు, పుస్తకాలు వెలువడతాయని ఊహించి ఉండడు. కొన్ని సంవత్సరాలు పోతే ఎవరి చేతుల్లో అయినా ముద్రించిన వారపత్రిక కనిపిస్తే 'అబ్బో! ఈయనెంతటి ధనవంతుడు కాకపోతే అంత డబ్బు పోసి అచ్చేసిన పత్రికను కొని చదువుతాడు!' అని ఆశ్చర్యపోయే స్థితి రావచ్చేమో? అలా అంటారా లేక 'అంత డబ్బు తగలేసి పాత చింతకాయ పచ్చడి వంటి పత్రికలనే ఇంకా పట్టుకు తిరుగుతున్నాడు!' అని ఈసడించుకుంటారా? ఏమో లోకో భిన్నరుచి. ఇంతకీ ముద్రణ లేని పత్రికలు ఎలా?
'డైమండ్‌ సూత్ర' అనే తొలి పుస్తకాన్ని క్రీస్తు శకం 868లో చైనాలో ప్రచురించినట్లు చరిత్ర చెబుతోంది (అంతకంటే ముందే ప్రచురణ జరిగిందని చెప్పే వాదనలు కూడా ఉన్నాయి). అయితే జర్మనీకి చెందిన జాన్‌ గూటెన్‌ బర్గ్‌ 1436-40 మధ్య రూపొందించి చేతితో నడిపించిన అచ్చు యంత్రం ముద్రణా ప్రపంచ రూపు రేఖలనే మార్చి వేసింది. ఆరువందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏలిన ముద్రణ యంత్రం కొన్ని అవసరాలకు తప్ప భవిష్యత్‌లో చరిత్రగా మారనుందా? అవునని ఇప్పటికిప్పుడు చెప్పలేంగాని కాదని కూడా చెప్పలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతోంది.
తెలిసిన వారికి తెలిసినా తెలియని వారికి తెలిపేందుకు క్లుప్తంగా కొన్ని మాటలు. టాబ్లెట్‌ పీసి.. మొబైల్‌కు ఎక్కువ కంప్యూటర్‌కి తక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో చిన్న కంప్యూటర్‌. కంప్యూటర్ల వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని మరింత సౌకర్యంగా వినియోగించేందుకు (కొంత మంది టాయిలెట్‌కు వెళ్లినపుడు కూడా వినియోగిస్తున్నారు.) ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, టాబ్లెట్‌ పీసి, పాకెట్‌ పీసి వంటి చిన్న పరికరాలను రూపొందించారు. వాటిలో టాబ్లెట్‌ పీసి పేరుకు తగ్గట్టే పల్చగా ఒక చిన్న పుస్తక పరిమాణంలో ఉంటుంది. పుస్తకంమీద పెన్నుతో ఎలా రాస్తామో టాబ్లెట్‌ పిసి తెరపై డిజిటల్‌ పెన్‌ సహాయంతో అదే విధంగా రాయవచ్చు. కాస్త పెద్ద జేబుల్లో పెట్టుకొని లేదా చిన్న చేతి సంచిలో వీటిని తీసుకు వెళ్లవచ్చు. టైపుతో పనిలేకుండా డిజిటల్‌ పెన్నుతో రాసే రాతల్ని అక్షరాలుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి రాబోతోంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ప్రోసెసర్‌ తక్కువ వేడికి గురవుతుంది. విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు అనేక థర్డ్‌పార్టీ అప్లికేషన్లు లభిస్తున్నాయి. టాబ్లెట్‌ పిసితో పాటు అందించబడే పెన్‌ని ఉపయోగించి ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని, అప్లికేషన్లలోని మెనూలను యాక్సెస్‌ చేయవచ్చు. టాబ్లెట్‌ పిసిలో కీబోర్డును సైతం కనెక్ట్‌ చేసుకోగలిగే మోడళ్ళూ ఉన్నాయి. ఈ టాబ్లెట్లను ఒకందుకు రూపొందిస్తే తాడిని తన్నేవాడుంటే తలదన్నేవాడుంటాడన్నట్లు వాటిని చదువుకొనేందుకు ఎందుకు ఉపయోగించకూడదన్న ఆలోచన రావటమే తడవు ఉపయోగంలో పెట్టేశారు. ఇవి రానున్న రోజుల్లో మరో విప్లవానికి సాధనాలుగా మారనున్నాయి. పుస్తకాలు, పత్రికలు చదువుకోవటానికి మన చేతుల్లోకి ఇప్పటికే వచ్చేశాయి.
అత్యధిక సర్క్యులేషన్‌- మన స్థానం
వికీపీడియా తాజా సమాచారం ప్రకారం సర్క్యులేషన్‌ అంతర్జాతీయ ఆడిట్‌ బ్యూరో 2011 వివరాల మేరకు ప్రపంచంలో అత్యధికంగా ముద్రించే తొలి వంద దినపత్రికల్లో మన దేశంలోనే 17 ఉన్నాయి. ఇవన్నీ పదిలక్షలకు మించినవే. ఆంగ్లంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రపంచంలో మూడో స్థానంలో మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రాంతీయ భాషా పత్రికల్లో మన దేశంలో మొదటి స్థానంలో ఉన్న దైనిక్‌ జాగరణ్‌ ప్రపంచంలో ఏడవది. మన రాష్ట్రంలోని ఈనాడు పత్రిక మొదటి స్థానంలో ఉండగా దేశంలో ఐదవ, ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న వందలో కేవలం 35 పత్రికల సర్క్యులేషనే 2008 నుంచి వరుసగా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. మిగిలినవన్నీ తగ్గాయి. దీనికి ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దెబ్బ ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే కొన్ని పత్రికలు తమ సమాచారాన్ని ఇవ్వలేదని, కొన్ని తప్పుడు సమాచారాన్ని ముఖ్యంగా జపనీస్‌ పత్రికలు ఇచ్చినట్లు పేర్కొన్నది.

ఇక అసలు విషయానికి వస్తే చాలా సంవత్సరాల క్రితమే డాట్‌ కాం బూమ్‌లో అనేక ఎలక్ట్రానిక్‌ పత్రికలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు న్యూస్‌వీక్‌ చేయనున్నదేమంటే అచ్చంగా అచ్చులో మనకు కనిపించే మాదిరి పత్రికనే న్యూస్‌వీక్‌ గ్లోబల్‌ పేరుతో ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా మనకు అందించబోతోంది. సిడ్నీ హరమాన్‌ అనే వ్యాపారి 92 సంవత్సరాల వయస్సులో గతేడాది మరణించాడు. ఆడియో కంపెనీ యజమాని అయిన హర్‌మాన్‌ ప్రచురణ రంగం భవిష్యత్‌ ఎంత కాలం అన్న ప్రశ్న తలెత్తిన సమయంలో ఆ రంగంలోకి రావటం విశేషం. వాషింగ్టన్‌ పోస్టు కంపెనీ నుంచి న్యూస్‌ వీక్‌ను కేవలం ఒక డాలర్‌ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ప్రకటించుకున్నారు. 'వేనిటీ ఫెయిర్‌' పత్రిక మాజీ సంపాదకురాలు టీనా బ్రౌన్‌ను తన కంపెనీలోకి ఆహ్వానించాడు. అప్పటికే ఆమె బీస్ట్‌ అనే దినపత్రిక నడుపుతున్నారు. రెండింటినీ ఒకే యాజమాన్యం కింద విలీనం చేశారు. అయితే ఆకస్మికంగా బయటపడిన క్యాన్సర్‌తో హర్‌మాన్‌ కొంత కాలానికే మరణించాడు. న్యూస్‌వీక్‌ ప్రచురణ నిలిపివేత నిర్ణయాన్ని ఈ ఏడాది అక్టోబరులో టీనా బ్రౌన్‌ ప్రకటించారు. ప్రచురణ నిలిపివేత వలన ఏడాదికి 4కోట్ల డాలర్ల మేరకు నష్టం తగ్గుతుందని తెలిపారు.
టైమ్‌ మాగ్‌జైన్‌కు పోటీగా 1933లో ప్రారంభమైన న్యూస్‌వీక్‌ పాఠకుల మన్ననలు పొందింది. ఈ రెండు పత్రికల కోసం పాఠకులు ఎదురు చూసే వారు. అట్టమీది కథను వేరుగా ఇస్తాయా రెండూ ఒకటే ఇస్తాయా అన్న కుతూహలం ఉండేది. నష్టాలతో ఉన్న న్యూస్‌వీక్‌ను లాభాల బాటలో నడిపేందుకు దానికి మసాలా శృంగారాన్ని, రెచ్చగొట్టే శీర్షికలను జోడించి పాఠకులు, ప్రకటనదార్లను ఆకర్షించాలని చేసిన యత్నాల్లో భాగంగా నూతన యాజమాన్యం, సంపాదకురాలు టీనా చేసిన ప్రయోగం ఎదురుతన్నింది.
1991లో న్యూస్‌వీక్‌ పత్రిక గరిష్టంగా 33లక్షల కాపీలు అమ్ముడు పోయేది. ఈఏడాది జూన్‌కు అది 15లక్షలకు తగ్గింది. టైమ్‌కు ఉన్నన్ని వనరులు న్యూస్‌వీక్‌ పత్రికకు లేకపోవటంతో దానితో పోటీ పడలేకపోయింది. న్యూస్‌వీక్‌ పరిణామాలను చూసిన తరువాత వారపత్రికలు నడుపుతున్న అనేక మంది ఆలోచనలో పడ్డారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి అన్నదే ప్రశ్న. జపాన్‌, మెక్సికో, పాకిస్థాన్‌, పోలాండ్‌, దక్షిణ కొరియాలలో న్యూస్‌వీక్‌ ప్రచురణకు అనుమతి ఉంది. ఆసియాలో మరో రెండు కేంద్రాల నుంచి ప్రచురణకు సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ప్రచురణ నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టటానికి రెండు సంవత్సరాల క్రితం మాకు ధైర్యం కలగలేదు గాని డిజిటల్‌ పత్రికగా పాఠకుల వద్దకు వెళ్లగలమని, రానున్న రోజుల్లో ఈ క్రమం పెరగనుందని ఇప్పుడు విశ్వాసం కుదిరిందని పత్రిక సంపాదకురాలు టీనా బ్రౌన్‌ ముద్రణ మూసివేత ప్రకటనలో పేర్కొన్నారు.
గజెట్‌ స్వభావం మారెనే!
ప్రభుత్వ అధికారిక గజెట్‌ ప్రకటనలను ప్రచురించేందుకు ఉద్దేశించిన తొలి పత్రికలు నేడు వాటి స్వభావాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పత్రిక కూడా గజెట్‌లను ప్రచురించటం లేదంటే అతిశయోక్తి కాదు. తొలి పేజీలో వార్తలు ప్రచురించటం కూడా ఒకప్పడు అరుదైన అంశమే. మన దేశం విషయానికి వస్తే మొత్తం ఉపఖండాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటీష్‌ వారే ఇక్కడ పత్రికలను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రారంభించక ముందే ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ పోకడలను వ్యతిరేకించిన విలియం బోల్ట్‌ అనే సంపాదకుడు 1766లో నాటి బ్రిటీష్‌ వారి కేంద్ర స్థానమైన కొల్‌కతాలో ఆంగ్లేయుల కోసం ఒక పత్రికను ప్రచురించాడు. ఒక ప్రెస్‌ను కూడా ఏర్పాటు చేశాడు. రెండు సంవత్సరాల తరువాత ప్రభుత్వ వ్యతిరేక రాతల కారణంగా అతనిని స్వదేశానికి పంపివేశారు. బ్రిటన్‌ వెళ్లిన తరువాత ఈస్టిండియా కంపెనీల అవినీతి, అక్రమాలు, భారతీయుల కష్టనష్టాల గురించి ఐదువందల పేజీ పుస్తకాన్ని రాశాడు.ఆ తరువాతే 1780లో కొల్‌కతా సలహాదారు జేమ్స్‌ అగస్టస్‌ హిక్కే తొలి దినపత్రికగా పరిగణించబడే 'బెంగాల్‌ గజెట్‌'ను ప్రచురించాడు. 12 అంగుళాల పొడవు, ఎనిమిది అంగుళాల వెడల్పుతో నాలుగు పేజీల పత్రికను ప్రచురించాడు. అయితే అది కూడా కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండటం విశేషం. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం ఆ పత్రికకు అంతకు ముందు ఇచ్చిన పోస్టల్‌ అనుమతిని ఉపసంహరించింది. ఆ కారణంగానే హిక్కే తొలిసారిగా 20 మంది మనుషులను ఏర్పాటు చేసి పత్రికను పాఠకులకు అందించాడు. ఒక చర్చి మిషనరీ అక్రమాలకు వ్యతిరేకంగా వార్త రాయటమే ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అయినా పత్రిక ఆగక పోవటంతో పరువునష్టం దావా వేయించి ఐదు వందల రూపాయల జరిమానా, నాలుగు నెలల జైలుశిక్ష వేయించారు. దాంతో ఆ పత్రిక ఆగిపోయింది. హిక్కేకు వ్యతిరేకంగా ప్రభుత్వం 1781లో ఇండియా గజెట్‌ పేరుతో ఒక కొత్త పత్రికను ప్రారంభింపచేయించింది. భారత్‌ నుంచి వెలువడే పత్రికలు బ్రిటన్‌లోని రాజుగారి దగ్గర ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పాలకులు భయపడ్డారు. ఆ నాడు బ్రిటన్‌లో అచ్చయ్యే పత్రికలు మన దేశం రావాలంటే తొమ్మిది నెలలు పట్టేదట.

న్యూస్‌వీక్‌ యాజమాన్య చర్య వెనుక ఉన్న ప్రధాన కారణం పత్రికలో అందచేసే అంశాలు, వాటి నాణ్యత కాదు, అచ్చువేసి, పంపిణీ చేయటానికి అయ్యే ఖర్చు తగ్గింపు, దాని ఆదాయం పెంచటమే అసలైన సవాలు. యాజమాన్యం చేతులు మారినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అంకిత భావంతో పనిచేసిన సిబ్బంది వల్లనే దాని ప్రతిష్ట ఇప్పటికీ నిలిచింది. అమెరికాలోని మూడు ప్రధాన వార పత్రికల్లో 'యుఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్టు' 1933లో ప్రారంభమై 2010లో ప్రచురణ నిలిపివేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రమే వెలువడుతోంది. వచ్చే ఏడాదికి మిగిలేది టైమ్‌ ఒక్కటే. అయితే పాఠకులు ఇ-వారపత్రికలను ఆదరిస్తారా? న్యూస్‌వీక్‌ విషయాన్నే తీసుకుంటే ప్రస్తుతం అది ముద్రణ, మక్కీకి మక్కీ డిజిటల్‌ ఫార్మాట్‌లో కూడా వెలువడుతోంది. అయితే ముద్రించి అమ్ముడయ్యే కాపీలతో పోల్చితే డిజిటల్‌ సంచికను కేవలం 1.8 శాతం మాత్రమే తీసుకుంటున్నారని స్వయంగా వార్షిక ఆడిట్‌ రిపోర్టులో యాజమాన్యం పేర్కొన్నది. అయితే ప్రచురణ ఆగిపోయిన తరువాత డిజిటల్‌ చందాదార్లు పెరుగుతారని యాజమాన్యం ఆశిస్తోంది. అదే కంపెనీ వెలువరిస్తున్న బీస్ట్‌ దినపత్రికలో న్యూస్‌వీక్‌లోని కొంత సమాచారం ఇస్తున్నారు. ఈ కారణంగా ఒక నెలలో బీస్ట్‌ను నెట్‌లో చదివే పాఠకులు 1.5 కోట్లకు చేరారని, గతేడాది కాలంలో 70శాతం పెరుగుదల ఉందని చెబుతోంది. ఇదే న్యూస్‌ ముద్రణ నిలిపివేతకు ప్రేరణ కావచ్చు.
న్యూస్‌వీక్‌ మనుగడకోసం అనేకంటే దాని నుంచి లాభాలను పిండుకోవటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మసాలాలు జోడించటంతో పాటు సంపన్నుల పత్రికగా మార్చేందుకు అనేక సార్లు దాని తీరుతెన్నులను సవరించారు. 2009లో 'ఆలోచన-నాయకత్వం' అన్న ఇతివృత్తంతో కేవలం సంపన్నులను ఆకర్షించేందుకు కొన్ని మార్పులు చేశారు. దానిలో భాగంగానే తమ పత్రిక చందాల సంఖ్య 19లక్షల నుంచి 15లక్షలకు తగ్గుతుందని కూడా యాజమాన్యం ప్రకటనదార్లకు తెలిపింది. అంటే సంపన్నులకు తమ సమాచారం చేరాలంటే ప్రకటనలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తారని అది ఆశించింది. అయితే పదిశాతం పత్రికలు తగ్గుతాయనుకుంటే 34శాతం తగ్గినట్లు మరుసటి ఏడాది తేలింది.
న్యూస్‌వీక్‌ మూసివేత చర్చనీయాంశం కావటంతో వినియోగదారుల పత్రికలు ఆన్‌లైన్‌ ఆదరణ పొందుతున్నాయని ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో ఆర్థికంగా కూడా పరిపుష్టంగా ఉన్నాయని, న్యూస్‌ మాగజైన్లు అలాగే ఉంటాయని చెప్పలేమని ఎకనమిస్ట్‌ పత్రిక పేర్కొన్నది. అనేక సంస్థల నుంచి వెలువడుతున్న దినపత్రికలు ఒకవైపు ముద్రణ రూపంలో పాఠకులకు అందిస్తూనే వెబ్‌సైట్లను కూడా నిర్వహిస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని ప్రత్యేక స్టోరీలు లేదా సంక్షిప్త సమాచారంతో పాటు పత్రికల ఈ పేజీలను కూడా ఇస్తున్నాయి. ఎక్కువ భాగం ఉచితంగానే చదువుకోవచ్చు లేదా పరిమితంగా అందచేసేవి కూడా కొన్ని ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వంటి ఒకటి రెండు పత్రికలు మాత్రం ఆన్‌లైన్‌కు కూడా ముక్కుపిండి రుసుము వసూలు చేసున్నాయి. కొన్ని పత్రికలు ఇప్పటికే ముద్రణ విభాగాలను ఎత్తివేశాయి. నెదర్లాండ్స్‌లో 'డిఏజి', అమెరికాలో 'ది కాపిటల్‌ టైమ్స్‌' 2008లో, 2010లో ఆస్ట్రేలియన్‌ టైమ్స్‌ పత్రికలు ఆన్‌లైన్‌కు మారాయి. కొన్ని డిజిటల్‌ రూపంలో ఇస్తే మరికొన్ని పిడిఎఫ్‌ రూపంలో అందచేస్తున్నాయి. డిజిటల్‌ రూపంలో ఇస్తే ఎవరైనా సమాచారాన్ని తీసుకోవచ్చు. అదే పిడిఎఫ్‌లో ఇస్తే కేవలం చదువుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ అచ్చు పేజీలలో ఇచ్చే సమాచారాన్ని మొత్తంగా ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నది.
కొన్ని కేవలం ఆన్‌లైన్‌(ఇంటర్నెట్‌) పత్రికలుగానే ప్రారంభమయ్యాయి. టీవీలు, రేడియోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవటానికి ఆన్‌లైన్‌ పత్రికలు కూడా ఎప్పటి కప్పుడు సమాచారాన్ని వెబ్‌లో పెడుతున్నాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికల యాజమాన్యాలకు టీవీ, రేడియోలు ఉన్నందున వాటికోసం తయారు చేసిన సమాచారాన్ని పత్రికల వెబ్‌సైట్లలో కూడా వెంటనే పెడుతున్నాయి. మన దేశంలోని పత్రికలు భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నాయి. హిందూ వంటి ఆంగ్ల పత్రికలు రాత్రి పొద్దుపోయే వరకు వార్తా సంస్థలు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే తమ సైట్లలో పెడుతున్నాయి. తమ విలేకర్లు ఇచ్చే వార్తలు, విశ్లేషణలు, వ్యాసాలను అచ్చు పత్రిక వెలువడిన తరువాత పొద్దుపోయాక వెబ్‌లో పెడుతున్నాయి. కొల్‌కతా నుంచి వెలువడే 'ది టెలిగ్రాఫ్‌' వంటి పత్రికలు ఎంతో ముఖ్యమైన ఘటనలు జరిగితేనే ఎప్పటికప్పుడు వార్తలను వెబ్‌సైట్‌లో పెడుతున్నాయి. ఆన్‌లైన్‌ ఎడిషన్లతో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. అచ్చు అయిన వార్తలు, వ్యాఖ్యలపై కొన్ని చట్టపరమైన సమస్యలు ఉంటాయి. వాటిని తప్పించుకొనేందుకు, మరింత సమాచారాన్ని ఇచ్చేందుకు పత్రికల వెబ్‌సైట్లు బ్లాగులను ఏర్పాటు చేశాయి. వాటిలో రాసే అంశాలన్నీ పత్రికల్లో అచ్చుకావు. పత్రికల్లో రాసేవారే వాటికి కూడా రాస్తున్నప్పటికీ చట్టపరిధినుంచి తప్పించుకోవచ్చు. బ్రిటన్‌ వంటి ఒకటీ అరా దేశాల్లో తప్ప బ్లాగుల్లో వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించే చట్టాలు లేవు. ఇదంతా మీడియా, కమ్యూనికేషన్‌ రంగంలో వచ్చిన పోటీ నుంచి తట్టుకొని నిలబడేందుకు, ఖర్చులు తగ్గించుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. దీన్నే కన్వర్జెన్స్‌ అంటున్నారు. అంటే ముద్రణ, టీవీ, రేడియో, బ్లాగ్స్‌, వెబ్‌ సైట్లలో ఒక దగ్గర రూపొందించే సమాచారాన్ని అన్ని విభాగాలు ఉపయోగించుకోటం. దీనివలన ఖర్చు, సమయం కూడా ఎంతో తగ్గుతుంది. వాణిజ్య ప్రకటనలు కూడా ఇందుకు అనుగుణంగానే రూపొందుతున్నాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్లుగా అన్ని రకాల మీడియా విభాగాలున్న కంపెనీలు ప్రకటనదార్లకు పాకేజీలు ప్రకటిస్తున్నాయి. 2008లో ధనిక దేశాల్లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం మీడియాలో అనేక మార్పులకు నాంది పలికింది. సంప్రదాయ వ్యాపారాలు కుప్పకూలాయి. అమెరికాలో 'సియాటిల్‌ పోస్ట్‌-ఇంటిలిజెన్సర్‌' అనే పత్రిక 149 సంవత్సరాల ముద్రణా విభాగాన్ని 2009లో నిలిపివేసి ఆన్‌లైన్‌కు పరిమితమైంది. అనేక పత్రికలు ఇదే బాట పట్టాయి. కన్వర్జెన్స్‌ పెరిగింది.
ఆన్‌లైన్‌ పత్రికల్లో 1991లో ప్రారంభమైన 'వీకెండ్‌ సిటీ ప్రెస్‌ రివ్యూ' తొలి దినపత్రికల్లో ఒకటి. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. దాన్నుంచి సమాచారం పొందాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతకు ముందు 1974లోనే ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం 'న్యూస్‌ రిపోర్టు' పేరుతో ఒక ఆన్‌లైన్‌ పత్రికను ప్రారంభించిందిగాని అది అందరికీ అందుబాటులోకి రాలేదు. బ్రెజిల్‌లో 1987లో జర్నల్‌డోడియా అనే పత్రికను ఆన్‌లైన్‌లో పెట్టినప్పటికీ అది కూడా పరిమితమైనదే. 1991 తరువాతే అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
ఆన్‌లైన్‌లో చదువుకొని కళ్లను కష్ట పెట్టటం ఎందుకనుకొనేవారికోసం కొన్ని కంపెనీలు కన్వర్జెన్స్‌లో భాగంగా పాడ్‌ కాస్ట్‌ పేరుతో చదివి వినిపించే సేవను కూడా ప్రారంభించాయి. హిందూ దినపత్రిక తన సంపాదకీయాలను నాలుగు దక్షిణాది భాషల్లోకి తర్జుమా చేయించి ఉచితంగా వినిపిస్తోంది. బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక 2005లో అలాంటి ఉచిత సేవను ప్రారంభించింది. చెల్లించే రుసుమును బట్టి సెల్‌ఫోన్లకు సమాచారం, వార్తలను పంపే సేవలను కూడా మీడియా సంస్థలు అందిస్తున్నాయి.

గూటెన్‌ బర్గ్‌ ముద్రణా విశేషాలు
జాన్‌ గూటెన్‌ బర్గ్‌ అచ్చు యంత్రాన్ని కనుగొన్నప్పటికీ వెంటనే బహుళ ఉపయోగంలోకి రాలేదు. లభ్యమైన అసంపూర్ణ చరిత్రమేరకు క్రీస్తు శకం 200 సంవత్సరంలో చెక్కపై అక్షరాలను చెక్కి ముద్రించినట్లు చెబుతారు. తరువాత ఒక చోటి నుంచి మరోచోటికి కదలించే టైప్‌ 1040లో, ఆ తరువాత 1454లో గూటెన్‌బర్గ్‌ ముద్రణ యంత్రం, 1500 సంవత్సరంలో లోహాలపై యాసిడ్‌ పోసి బొమ్మలు, అక్షరాలు రూపొందించటం, 1642లో లోహపు రేకుపై బొమ్మల రూపం వచ్చేట్లుగా(హాఫ్‌టోన్‌) వేలాది చుక్కలను పెట్టటం, 1768లో లోహపు రేకుపై బొమ్మలు, అక్షరాల చుక్కలకు ఇంకు అద్ది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ముద్రించటం, 1796లో నిన్నమొన్నటి వరకు ఉపయోగంలో ఉన్న లిథోగ్రఫీ(నున్నటి రాయిపై అక్షరాలను రాసి వాటి ప్రతిరూపాన్ని కాగితం లేదా వస్త్రంపై ముద్రించే ప్రక్రియ) 1837లో ఒకటి కంటే ఎక్కువ రంగుల్లో లిథోగ్రఫీ పద్ధతిలో ముద్రించటం, 1843లో రోటరీ ప్రింటింగ్‌, 1875లో ఆఫ్‌సెట్‌, 1886లో లోహంతో అక్షరాల తయారీ, ముద్రణ, 1890లో స్టెన్సిల్‌ కటింగ్‌, 1907లో స్క్రీన్‌ ప్రింటింగ్‌, 1923లో డూప్లికేటింగ్‌ మిషన్‌, 1957లో కంప్యూటర్‌ ప్రింటర్‌, 1960 దశకంలో ఫొటోటైప్‌ సెట్టింగ్‌, 1964లో డాట్‌మాట్రిక్స్‌ ప్రింటర్‌, 1969లో లేజర్‌ ప్రింటర్‌, 1972లో థర్మల్‌ ప్రింటర్‌, 1976లో ఇంక్‌జెట్‌, 1986లో త్రీ డి ప్రింటింగ్‌, 1993లో డిజిటల్‌ ప్రెస్‌ ఉనికిలోకి వచ్చాయి. ఇప్పుడు టాబ్లెట్లు ఉనికిలోకి రావటంతో అసలు ముద్రణ, యంత్రాలతోనే అవసరం లేకుండా పోయింది.
చేతితో గంటకు జాన్‌ గూటెన్‌ బర్గ్‌ ఎన్ని పేజీలను ప్రచురించాడని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పటం కష్టం. లభ్యమైన సమాచారం ప్రకారం ఆయన అచ్చువేసింది బైబిల్‌. పేజీకి 42లైన్లు ఉన్నాయి. అడుగున్నర పొడవు, అడుగు వెడల్పు కాగితంపై ముద్రించారు. నిపుణుల అంచనా ప్రకారం ఒక్కొక్క పుస్తకంలో 42లైన్లున్న పేజీలు 1,272 ఉన్నాయి. రెండువందల కాపీలను ముద్రించటానికి కనీసం ఐదు సంవత్సరాలు పట్టి ఉంటుందని పేర్కొన్నారు. అంటే రోజుకు పన్నెండు గంటలు పనిచేసి ఉంటే 163 పేజీలను ప్రచురించి ఉంటారు. గంటకు పదమూడున్నర పేజీలని చెప్పవచ్చు. మరొక అంచనా ప్రకారం గంటకు 20-30 పేజీలు ముద్రించి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. గూటెన్‌బర్గ్‌ ప్రెస్‌ తరువాత నాలుగు వందల సంవత్సరాలకు 1880లో రూపొందించిన యంత్రంపై గంటకు 480 పేజీలు అచ్చు వేశారు. ఆ తరువాత 50 ఏళ్లకు గంటకు రెండున్నరవేలు అచ్చువేశారు. ఇప్పుడు గూటెన్‌ బర్గ్‌ పేజీలకు ఎనిమిది రెట్ల పెద్దవైన పేజీలను గంటకు లక్ష కాపీలవరకు ముద్రించగలుగుతున్నాము. అదీ ఒకేసారి రెండువైపులా అని గమనించాలి. 

Courtesy with: Prajashakthi Daily

No comments:

Post a Comment