Thursday 27 September 2012

మేం మూఢనమ్మకాలకు వ్యతిరేకం.. ఏ మతానికి కాదు..2


  • అశాస్త్రీయ ఆచారాలు - 19
'సుబ్బారావ్‌! మతనాయకులూ, మత ప్రచారకులూ మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. హిందూ మతనాయకులేగాదు, ముస్లిం, క్రిష్టియన్‌ మత నాయకులు కూడ మూఢనమ్మకాలను ఖండిస్తూనే ఉన్నారు. వాటిని వివరిస్తాను'' అని 24-8-2012 నాటి ''ది హిందూ'' పత్రికను సుబ్బారావుకిచ్చాను.
దానిలో ''వదంతులు చిక్కగా, వేగంగా వ్యాపిస్తాయి'' అనే వార్త సారాంశమిది. ''షహీనానగర్‌ ఏరియా (హైదరాబాద్‌)లో ఒక బాలిక జన్మించిందనీ, ఆ అమ్మాయి జన్మించిన 22-8-12 రాత్రి ఎవరైనా పిల్లలు నిద్రపోతే వారు చనిపోతారని చెప్పిందనే వదంతి హైదరాబాద్‌ పాతబస్తీలో ప్రజలను భయభ్రాంతులను చేసింది. ఈ వదంతిని సెల్‌ఫోన్లు చాలా వేగంగా వ్యాప్తి చేశాయి. అంతే! పాతబస్తీలోని అనేక ప్రాంతాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రలేపి, వాళ్ళు మరల నిద్రపోకుండా ఉండేందుకు నానా తంటాలు పడ్డారు. కొంతమంది పిల్లలతో ఆటలాడించారు. కొంతమంది మోటారు సైకిళ్ళ మీదా, ఆటోలలోనూ వారిని తిప్పారు. అయితే, ముఖ్యమైన విషయమేమిటంటే, మత నాయకులు స్థానిక మసీదులలో ఏర్పాటు చేయబడిన లౌడ్‌స్పీకర్లలో ఈ వదంతులను నమ్మవద్దనీ, పిల్లలు నిద్రపోయినా ఏమీకాదనీ చెప్పడం జరిగింది. అయినా ప్రజలపై లౌడ్‌స్పీకర్ల ప్రచారం ఏమీ ప్రభావం కలిగించలేదు.'' కాబట్టి సుబ్బారావ్‌! అనేక సందర్భాలలో మతనాయకులు, మత ప్రచారకులు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం మనం గమనించవలసిన విషయం.
ఇక క్రిష్టియన్‌ మతనాయకులు కూడా మూఢనమ్మకాలను ఖండిస్తున్నారు. ఉదాహరణకు 17-9-1998 నాటి ఈనాడు పత్రికలోని ఒక వార్తను వినిపిస్తాను విను'' అని ఆ వార్తను చదివి వినిపించాను. ఆ వార్తలో ఇలా ఉంది. ''జ్యోతిష్యాన్ని గూర్చి పోప్‌ జాన్‌పాల్‌ ఇలా ప్రకటించారు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ధారించుకొనేందుకు, జాతకాలను తిరగేయాల్సిన పనిలేదు. రాశి ఫలాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హస్త సాముద్రికుల దగ్గరకు వెళ్ళవలసిన పనిలేదు. గ్రహబలాన్ని నమ్ముకోరాదు.''
కాబట్టి సుబ్బారావ్‌! మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తే, మతాన్ని విమర్శించినట్లు కాదు. ఎందుకంటే వాటిని తమకు తెలిసిన మేర మత నాయకులు ఖండిస్తున్నారు. మత ప్రచారకులు వాటిని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం మోసగాళ్ళూ, అవకాశవాదులే మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారాన్ని మత వ్యతిరేక ప్రచారంగా ప్రకటించి, మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేం ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు. కానీ, అన్ని మతాలవారూ మూఢనమ్మకాలను తరిమికొట్టాలి. శాస్త్రీయాలోచనా విధానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనదేశం శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగమిస్తుంది. ఆ రంగంలోని విజయాలు అన్ని రంగాలకూ విస్తరించి, మన దేశం ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏమంటావ్‌?'' అన్నాను.
''నీవు చెప్పింది ఆమోదయోగ్యం అంటాను'' అన్నాడు దృఢంగా సుబ్బారావు.
''సంతోషం'' అంటూ ముగించాను.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment