Wednesday 11 July 2012

కష్టసుఖాలకు కారణాలేంటి?


      ''పిిల్లలూ! మనకు వచ్చే కష్టాలకూ, సుఖా లకూ కారణాలు కొంతమంది విద్యా ర్థులు గతవారం చెప్పారు. ఇంకొందరు చెప్తానన్నారు వారు ఒక్కొక్కరూ చెప్పండి'' అన్నాను నేను.
''జుట్టు కత్తిరించుకొనే రోజునుబట్టి కూడా మన మంచి, చెడులు ఉంటాయని మా తాతయ్య చెప్పేవాడు మాస్టారూ. ఆయన శని, ఆదివారాల్లోనూ, పాడ్యమి, చవితి, షష్టి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమిరోజుల్లో క్షౌరం చేయించుకొంటే అరిష్టం అని, ఆ రోజుల్లో జుట్టు కత్తిరించుకో వడానికి సెలూన్‌కు వెళ్ళేవాడు కాదు. మిగి లిన రోజుల్లోనే వెళ్ళేవాడు'' అన్నాడు శ్రీను.
''మా తాతయ్య నిద్రలేవగానే వేద పండితుణ్ణిగానీ, ముత్తైదువ స్త్రీనిగానీ, గోవునుగానీ, అగ్నిహోత్రాన్నిగానీ చూస్తే శుభం కలుగుతుందనేవాడు. పెరుగు, నెయ్యీ ఆవాలూ, అద్దమూ వీటిని చూడటం అశుభమనేవాడ'' ని సంధ్య చెప్పింది.
''బల్లి మెడపైన పడితే ఆపదలు కల్గుతాయనీ, కనుబొమ్మలపై పడితే ధన లాభమనీ, మోకాలిపై పడితే వాహనం కొంటారనీ, జుట్టుమీద పడితే కష్టాలొస్తా యనీ మా ఇంట్లో పంచాంగంలో రాసి ఉంది'' అన్నాడు వెంకటాచారి.
''ఇంట్లోని పేడ, కసువు, పెంట, ఎంగి లినీళ్ళు ఉత్తర, ఈశాన్య, తూర్పుదిక్కుల్లో పోస్తే సంతానము నశిస్తుందని మా అమ్మ చెప్పి కసువుగానీ, ఎంగిలినీళ్ళుగానీ మిగిలిన దిక్కుల్లోనే పారబోయించేది. ఆ దిక్కుల్లో పో స్తే శుభాలు కలుగుతాయట'' శ్రీలక్ష్మి అంది.
''సంతోషం. మీరు చాలా అంశాలు చెప్పారు. వీటి గురించి వచ్చేవారం వివరిస్తా..''


ఇవన్నీ ఇంకా అనేక ఇతర అంశాలు 'తాళపత్ర నిధి'' అనే గ్రంథంలోనూ, 'గృహవాస్తు'లోనూ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మనం తలంటుకొనే రోజుకీ, మన ఇంట్లో తేనెతుట్టె ప్రదేశానికీ, అరటిచెట్టు ఉండే దిశకీ, అలాగే భోజనం చేసే వైపుకీ, జుట్టు కత్తిరించుకొనే తిథికీ, బల్లిపాటుకూ మనకు వచ్చే కష్టసుఖాలకీ సంబంధం ఉందని ఎలా నిరూపించగలం? ఇన్ని వందల సంవత్సరాల నుండి ఎవరైనా నిరూపించారా? మన సుఖాలకి అసలు కారణం 'ఆత్మవిశ్వాసంతో కూడిన తీవ్రమైన కృషి' అని సామాజిక శాస్త్రవేత్తలందరూ స్పష్టం చేశారు. విజయం సాధించిన మహానుభావులందరూ నిరూపించారు. ఇవి లోపించినపుడు కష్టాలు వస్తాయి. వాస్తవమిది కాగా ఆవరణలోని అరటిచెట్టుకీ, నిద్రలేవగానే కనిపించే వ్యక్తికీ, కసువు పారవేసే ప్రదేశానికీ సంబంధం ఉందని నమ్మడం మన అమాయకత్వం, మనలోని అశాస్త్రీయ ఆలోచనా విధానం. తేనెపట్టు పట్టిన ఇంట్లో నివాసం ఉండీ, మధ్యలో నుండి గెలపొడుచుకు వచ్చిన అరటి చెట్టును పెంచీ, తనకే కష్టమూ, నష్టమూ జరగలేదనీ, జరగదనీ నూరేళ్ళక్రితమే నిరూపించారు కందుకూరి వీరేశలింగం గారు. కాబట్టి మన జయాపజయాలకీ, ధననష్టం, ధనలాభాలకీ ఎంగిలినీళ్ళు ఆమూల పారబోయడమో, తీసివేసిన గోళ్ళు ఇంట్లో ఉండటమోలాంటి నిరూపణ చెయ్యలేని అంశాలు కారణమని నమ్మకండి. మన కృషి, పట్టుదలలే కారణమని నమ్మండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. వాటిని వదలండి.
మన పెద్దలు చెప్పినట్లు 'కృషితో నాస్తి దుర్భిక్షం'; అంటే కృషితో వ్యక్తిగత దరిద్రాన్నే కాదు సామాజికంగా కరువును కూడా లేకుండా చేయవచ్చు'' అని ముగించాను.
ఒక్క నిమిషం నిశ్శబద్దం. తర్వాత సాయిలక్ష్మి లేచి ఇలా అడిగింది. 'మరి యీ మూఢనమ్మకాలు మన సమాజంలోకి ఎలా ప్రవేశించాయి మాస్టారూ?''
''మంచి ప్రశ్న వేశావమ్మా! దీనికి సమాధానం వచ్చే క్లాసులో చెబుతాను'' అన్నాను.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment