Saturday 26 May 2012

ప్రాణాయామం


యోగాలో ప్రాణాయామానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని శరీరమంతా వ్యాపింపజేయడం. శ్వాసకు ప్రాణానికి, శ్వాసకు మనస్సుకు చాలా దగ్గర సంబంధముంది. శ్వాసను స్వాధీనపరచుకుంటే మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ప్రాణాయామాన్ని పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం, అర్ధపద్మాసనాలలో ఏదో ఒక ఆసనంలో ఉండి చెయ్యాలి. వెన్నుముక, తల నిటారుగా ఉండాలి. ఖాళీ కడుపుతో చెయ్యాలి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట, ఛాతి బాగాలు ముందుకు రావాలి. వదలినప్పుడు లోపలికి వెళ్లాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చెయ్యాలి. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు విశాలమై ఆక్సిజను శరీరంలోకి ఎక్కువగా చేరుతుంది. ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ ఆక్సిజన్‌ సరఫరా జరిగి బాగా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రాణాయామం చేయడానికి పద్మాసనం, వజ్రాసనం అత్యంత అనుకూలమైనవి. ఈ ఆసనాలలో ఎంత సేపు కదలకుండా కూర్చున్నా శరీరంలో ఎలాంటి నొప్పులూ రావు.
పద్మాసనం : కింద కూర్చుని రెండు కాళ్లను చాపాలి. మొదట కుడికాలును ఎడమ తొడపైన, ఆపై రెండవ కాలును చేతులతో పట్టుకుని కుడితొడపైన ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చిన్‌ముద్రలో ఉంచుకోవాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు జాగ్రత్తగా వెయ్యాలి. లేదా వారు అర్ధ పద్మాసనంలో వేయొచ్చు.
వజ్రాసనం : రెండు కాళ్లను వెనకకు ముడిచి, రెండు మడిమలు పిక్కలకు అంటి ఉండేటట్లు ఉంచి, కాలి బొటన వేళ్లు ఒకదానికొకటి దగ్గరగా కలిపి ఉంచాలి. తల, వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులు చిన్‌ముద్రలో ఉంచాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువగా ఉన్న వారు కొన్ని రోజుల వరకు వజ్రాసనం వెయ్యకూడదు.
- డాక్టర్‌ రాచమల్ల రంగనాథ్‌రెడ్డి
మిత్ర యోగ సెంటర్‌, కడప.
సెల్‌ : 9440074773

No comments:

Post a Comment